* తూప్రాన్ పురపాలిక పరిధిలో 44 వెంచర్లు ఉన్నాయి. వాటిలో రెండు వెంచర్లు మాత్రమే హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయి. మిగితా అన్ని గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినవి. పురపాలికగా మారిన తర్వాత కూడా వెంచర్లు వేశారు. వాటి యజమానులకు పురపాలిక తాఖీదులు ఇచ్చింది.
* మనోహరాబాద్ మండలంలోని మనోహరాబాద్, కాళ్లకల్, కూచారం, జీడిపల్లి శివార్లలో 20 పైగా వెంచర్లు ఉన్నాయి. వీటిలో కేవలం రెండింటికే అనుమతులు ఉన్నాయి.
మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట పురపాలికలతోపాటు మండల కేంద్రాల్లో అనుమతులు లేని వెంచర్లే అధికంగా ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొందరు అక్రమార్కులు హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోని తూప్రాన్, నర్సాపూర్ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా వెంచర్లు వేసి ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. ఈక్రమంలో నెల రోజుల క్రితం అనుమతులు ఉన్నా.. లేకున్నా రిజిస్ట్రేషన్ అయ్యేవి.
తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ.. అక్రమ వెంచర్లు, ప్లాట్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ శాఖ నిర్ణయంతో నిబంధనలు ఉల్లఘించిన వాటిల్లో క్రయవిక్రయాలకు అడ్డుకట్ట పడనుంది. తెలంగాణ పురపాలిక చట్టం-2019, పంచాయతీరాజ్ చట్టం-2018 నిబంధనల ప్రకారం ఒకసారి రిజిస్ట్రేషన్ అయినా అనుమతులు లేకపోతే మరోసారి రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం లేదు. ఫలితంగా జిల్లాలో అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కొత్త నిబంధనలు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భవనాలు విక్రయించాలన్నా పురపాలిక లేదా గ్రామపంచాయతీ అనుమతులు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలులేకుండా పోయింది. ఈమేరకు ఇప్పటికే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీల్లోనూ.. జిల్లాలోని మేజర్ పంచాయతీల్లోనూ స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. దీంతో మార్చి నుంచి జులై వరకు క్రయవిక్రయాలు తగ్గినా ఈ నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అనుమతులు ఉన్నా లేకున్నా ప్లాట్ల క్రయ విక్రయాలు జోరుగా సాగాయి. ప్రధానంగా మనోహరాబాద్, చేగుంట, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట... తదితర మండలాల్లో ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొత్త నిబంధనలతో గ్రామపంచాయతీ పరిధిలోని ప్లాట్లు, భవనాల క్రయవిక్రయాలు పూర్తిగా తగ్గనున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడనుందని కొందరు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర్వులు వచ్చాయి...
అనుమతులు లేని వెంచర్లు, ప్లాట్లు, భవనాల రిజిస్రేష్టన్లను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. తూప్రాన్లో నెల రోజులుగా అనుమతులు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ప్రస్తుతం అన్ని అనుమతులు ఉన్న వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తాం.
- గాయాసోద్దిన్, సబ్రిజిస్ట్రార్, తూప్రాన్
తాఖీదులు ఇస్తున్నాం..
జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట పురపాలికల పరిధిలో అనుమతులు లేని ప్లాట్లు, భవనాల యజమానులు తాఖీదులు అందిస్తున్నాం. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కొత్త పురపాలిక చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం.
- విజయశ్రీ, టీపీవో, మెదక్ జిల్లా
ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'