విద్యార్థులకు ఉపయోగపడే బోధనాభ్యాసన సామగ్రి తయారు చేయడంతో పాటు పాఠశాల గోడలను బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం తొగుట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ప్రేమ్ కుమార్. ఆయన సెకండరీ గ్రేడ్ టీచర్గా పని చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో సమయం వృథా చేయకుండా అంతర్జాలంలో చూసి కార్టూన్ బొమ్మలు వేయడం నేర్చుకున్నారు. సొంత డబ్బులతో రంగులు కొనుగోలు చేసి తరగతి గదుల గోడలపై విద్యార్థులను ఆకట్టుకునేలా కార్టూన్లు వేశారు.
కాగితం ముక్కలతో
1 నుంచి 10 వరకు ఎక్కాలు, ఆంగ్ల వర్ణమాలను రంగులతో తీర్చిదిద్దారు. విద్యార్థులకు జ్ఞానం పెంపొందేలా కొన్ని రకాల పజిల్స్నూ గోడలపై చిత్రించారు. ఎండిన ఓ చెట్టు కొమ్మను తరగతి గదిలో ఏర్పాటు చేశారు. ఆ కొమ్మకు ఆంగ్ల అక్షరమాలతో పండ్లు, కూరగాయల పేర్లు తెలిపేలా.. రంగురంగుల కాగితం ముక్కలతో ఆకుల రూపంలో అందంగా అలంకరించారు.
నిజంగా పక్షులే ఉన్నాయా అనిపించేలా..
వ్యర్థానికి అర్థం చెప్పేలా పాత కారు స్కూటర్ల టైర్లను కొనుగోలు చేసి తన సృజనాత్మకతతో పక్షుల రూపంలో కత్తిరించారు. ఆకర్షణీయమైన రంగులు వేసి పాఠశాల ప్రాంగణంలోని చెట్ల కొమ్మలకు వేలాడదీశారు. వాటిని చూస్తే పక్షుల్లా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాడి పడేసిన వాటర్ బాటిళ్లలో చిన్న చిన్న మొక్కలను పెంచుతూ.. మొక్కల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు తెలియజేస్తున్నారు. పాత టైర్లతో విద్యార్థులు ఆడుకునేందుకు వివిధ ఆట వస్తువులను రూపొందించారు.
తోటి ఉపాధ్యాయుల సహకారంతో
ఇదంతా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో చేసినట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు. సొంత ఖర్చుతో పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ద్వారా గ్రామస్థుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు ఈ యువ ఉపాధ్యాయుడు.
ఇదీ చదవండి: రైతులను నష్టపరిచే చట్టాలపై చట్టసభల్లో నిలదీస్తాం: భట్టి