పిల్లలమర్రి 700 ఏళ్ల చరిత్ర గలిగిన మహావృక్షం. తెలంగాణలో ప్రముఖ పర్యటక కేంద్రం. ఒకప్పుడు ఈ వృక్షం 4 ఎకరాల మేర విస్తరించి ఉండేది. కాలక్రమేణా ఆ విస్తీర్ణం తగ్గిపోయింది. అసలు ఈ చెట్టు మొదలు ఎక్కడో చెప్పుడం కష్టమే. ఏది మొదటి కాండమో ఏది శాఖో గుర్తించలేము. ఏటా ఈ వృక్షాన్ని చూసేందుకు లక్షల మంది సందర్శకులు వెళ్తుంటారు. అక్కడ ఎన్నోసినీగీతాలు చిత్రీకరించారు.
కొత్త చిగుళ్లతో మహావృక్షం
రెండేళ్ల కిందట కొమ్మలు కూలి, చెదలు సోకి, తెల్లపుండు రోగంతో దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. అలాంటి వృక్షానికి అటవీశాఖ చికిత్స చేసి పునరుజ్జీవం అందించింది. ప్రస్తుతం పిల్లలమర్రికి సుమారు 45 చోట్ల కొత్త ఊడలొచ్చాయి. 35 చోట్ల కొమ్మలు నేలపై వాలకుండా బలంగా తయారయ్యాయి. కొమ్మలు, రెమ్మలు కొత్త చిగుళ్లతో పచ్చదనాన్ని సంతరించుకుని పిల్లలమర్రి కోలుకుంది.
చికిత్స ఫలితంగా కోలుకున్న వృక్షం
సరిగ్గా రెండేళ్ల కిందట పిల్లలమర్రిలోని భారీవృక్షం కూలిపోయింది. కారణాలేమిటో తెలుసుకునేందుకు వచ్చిన కలెక్టర్ రొనాల్డ్ రోస్.. తక్షణమే సందర్శనకు అనుమతి నిలిపివేశారు. అటవీశాఖకు చికిత్స బాధ్యత అప్పగించారు. వెంటనే వారు చెదలు నివారించి, నిరంతరం నీటివసతిని కల్పించారు. చెట్టు పురోగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ చికిత్స చేస్తూ వచ్చారు. ఏడాదిన్నర కాలంగా అందిస్తున్న చికిత్స ఫలితంగా ప్రస్తుతం పిల్లలమర్రి పూర్తిగా కోలుకుందని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు.
ఇన్పెక్షన్లు సోకి...
పిల్లలమర్రి వృక్షం ఒకప్పుడు అటవీశాఖ ఆధ్వర్యంలో ఉండేది. పర్యటక కేంద్రంగా మారడం వల్ల దాని నిర్వహణ బాధ్యతలను ఆ శాఖకే అప్పగించారు. సందర్శకులు ఇష్టానుసారం చెట్టుపైకి ఎక్కడం, శాఖలపై పేర్లు చెక్కడం, చెట్టుకు హాని తలపెట్టే పనులు ఎన్నో చేయడంతో ఇన్ఫెక్షన్లు మహావృక్షాన్ని బలహీనం చేశాయి. చెట్టు విస్తరించడం ఆగిపోయి.. బరువైన కొమ్మలు కూలి పూర్తిగా దెబ్బతిన్నది. అందుకే అధికారులు ప్రస్తుతం పిల్లలమర్రి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. పక్కనే ఏర్పాటు చేసిన వంతెనపై నుంచే చెట్టును చూడాలి. చెట్టును తాకే అవకాశం లేదు. అటవీశాఖ అందిస్తున్న చికిత్స మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.
నిరంతరాయంగా దృష్టి సారించాలి...
రాబోయే రోజుల్లోనూ అధికార యంత్రాంగం.... నిరంతరాయంగా పిల్లలమర్రి సంరక్షణపై దృష్టిసారించాలని పాలమూరు ప్రజలు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...