ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్... అన్నిరంగాలను దెబ్బతీయడమే కాదు ఎంతోమంది ఆదాయానికి గండికొట్టింది. ఆ జాబితాలో గురుకుల పాఠశాలల్లోని వంట సిబ్బందీ చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 204 మైనార్టీ గురుకులాలుండగా... ఉదయం అల్పహారం నుంచి రాత్రి భోజనం వరకు వండి, వడ్డిస్తారు. మార్చి వరకూ అంతా సవ్యంగానే సాగినా... కొవిడ్తో గురుకులాలు మూతపడటం వల్ల విద్యార్థుల్లేక వంట సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు.
నిరాశే ఎదురు...
విద్యాసంస్థలు తెరిస్తే పనిదొరుకుతుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. వసతిగృహాలు తెరవకపోవడం వల్ల వంట సిబ్బందిపై ఆధారపడిన కుటుంబాలు... కనీస అవసరాలకు నోచుకోక ఆకలితో అలమటిస్తున్నాయి. వైరస్ తీవ్రత వల్ల వేరే రంగాల్లోనూ పని దొరకడమే గగనమైందని వాపోతున్నారు. గురుకులాల్లోని మిగతా ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి పని కల్పిస్తూ జీతం చెల్లిస్తున్నారని, తమనూ అదే రీతిలో ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఉపాధి మార్గం చూపండి...
గురుకుల సొసైటీ నుంచి నిధులు విడుదల కానందునే వంట సిబ్బందికి జీతాలివ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. గురుకులాలు తెరుచుకుంటేనే వారిని మళ్లీ పనిలోకి తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని వంట సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్లు సస్పెన్షన్