రాష్ట్ర ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ పేరిట పేద, మధ్యతరగతుల నుంచి లక్షల రూపాయలు దోచుకునేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. భూములు, లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీఓ నం.131/2020ను, ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన పురపాలక చట్టం నిబ్బందన 174(1) ప్రకారం 75 గజాలలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతి అవసరం లేదని ఉన్నా.. ప్రభుత్వం 100 చదరపు మీటర్లలోపు ఉన్న ప్లాట్లకు క్రమబద్ధీకరణ పేరుతో దాదాపుగా 40 వేల వరకు వసూలు చేస్తుండడం సరికాదన్నారు. ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి భూముల క్రమబద్ధీకరణ పేరుతో ప్రజలపై ఆర్థికభారం వేసి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
కరోనా మహమ్మారితో గత ఆరు నెలలగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... ఇప్పుడు క్రమబద్ధీకరణ పేరుతో వేలు, లక్షల రూపాయలు వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎల్ఆర్ఎస్ జీఓ నెం.131ని రద్దు చేసి అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొన్నటువంటి వారికి ఎలాంటి రుసుము లేకుండా రెగ్యూలరైజ్ చేయాలన, గృహ నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలు అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.