కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి బీమా సొమ్మును స్వాహా చేసిన ఉదంతం మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. స్థానిక మన గ్రోమోర్ కేంద్రంలో అనుబంధమైన చోళ బీమా సంస్థ 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కరోనా బాధితులకు వైద్య చికిత్స కోసం బీమా సౌకర్యం కల్పించింది.
121 రూపాయలు చెల్లిస్తే 10 వేలు, 361 రూపాయలు చెల్లిస్తే 30 వేలు, 601 రూపాయలు చెల్లిస్తే 50 వేల బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. డబ్బులు కట్టిన సంవత్సరం తర్వాత బీమా అమల్లోకి వస్తుందని తెలిపారు. గూడూరు మండలంలో సుమారు వంద మందికిపైగా బీమా చేయించుకున్నారు.
ఓ కరోనా బాధితుడికి సొమ్ము రావడంతో... అప్పనంగా సొమ్ము కొట్టేద్దామని మరికొందరు పథకం రచించారు. గూడూరు సర్కిల్ పరిధిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో కుమ్మక్కయ్యారు. కరోనా పరీక్షలు చేయించుకునేటప్పుడు నెగటివ్ వచ్చినా... పాజిటివ్ వచ్చినట్లుగా సంక్షిప్త సందేశాన్ని పంపించుకుని ప్రింట్ తీసుకున్నారు. దానిపై వైద్యుల సంతకం చేయించుకుని బీమా సంస్థకు మెయిల్లో పంపించారు.
వైద్యుల సంతకం ఉండడం వల్ల బీమా సంస్థ అధికారులు అనుమానించలేక పోయారు. ఎలాంటి తనిఖీలు చేయకుండానే 17 మందికి 50 వేల రూపాయల చొప్పున సొమ్ము ఖాతాల్లో జమ చేశారు. వారికి సగం కంటే ఎక్కువ మంది కరోనా రాకపోయినా బీమా సొమ్ము అందినట్లు తెలిసింది. ఓ వ్యక్తి ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై చోళ సంస్థ మేనేజర్ కుమార్ను ఫోన్లో వివరణ కోరగా నకిలీ ధ్రువపత్రాల సమర్పించి సంస్థను మోసం చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: వ్యాప్తి గొలుసు తెగితేనే కరోనా కట్టడి..!