కుమురంభీం జిల్లా దహేగం, పెంచికలపేట మండలాల్లో 20 రోజుల వ్యవధిలోనే పులి ఇద్దరిని పొట్టనబెట్టుకోవడంతో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. వెంటనే పులిని బంధించాలని డిమాండ్ చేస్తూ.. బెజ్జూరు మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు.
కొన్ని రోజులుగా గ్రామ సమీపంలో పులి సంచరిస్తోందని, మనుషులు, పశువులపై దాడి చేస్తోందని తెలిసినప్పటికీ అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆదివాసీలు ఆరోపించారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.
చనిపోయాక నామమాత్రపు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప పులిని పట్టుకునేందుకు ప్రయత్నించడం లేదని వాపోయారు. అడవులే ఆధారంగా బతికే ఆదివాసీల జీవితాలకు విలువలేదా అని ప్రశ్నించారు. వారం రోజుల్లో పులిని బంధించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చూడండి: వైకల్యం శరీరానికి తప్ప మనుసుకు కాదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్