విధి నిర్వహణలో అసువులు బాసిన అమర జవాన్ షాకిర్ హుస్సేన్కు కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో నివాళులు అర్పించారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇందులో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డా. పాల్వాయి హరీశ్ బాబు, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, పట్టణ ఎస్ఎచ్వో మోహన్, కమిషనర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.

భారత్ మాతా కీ జై, షాకిర్ హుస్సేన్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దేశ సేవ చేసేందుకు భారత సైన్యంలో చేరడం గర్వకారణమని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. షాకిర్ హుస్సేన్ లాంటి సైనికుడు దేశ యువతకు ఆదర్శమని, దేశ సేవలో అమరుడైన జవాన్ షాకిర్ హుస్సేన్ ఎల్లప్పుడూ ప్రజల మనసులో నిలిచిపోతాడని తెలిపారు.
ఇదీ చదవండి: రెండ్రోజుల్లో తెలంగాణ-ఏపీల మధ్య ఆర్టీసీ సర్వీసులు!