కొలువుల్లో చేరి నిండా నాలుగు మాసాలైన గడవలేదు. రాత్రింబవళ్లు కష్టించి.. ఉన్నతోద్యోగం సాధించామన్న సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించనేలేదు. సుదూర గమ్యంలో బంగారు భవిత ఉందని భావించిన వారికి మార్గమధ్యలోనే మృత్యువు ఎదురైంది. ప్రాణహిత నది రూపంలో వారిని జలసమాధి చేసింది. కంటికి రెప్పగా కాపాడుకుంటున్న తమ బిడ్డలు.. ప్రాణాలతో లేరనే వార్తను వారి తల్లిదండ్రులకు చేరవేసింది.
నిండా నాలుగు నెలలైనా గడవలేదు..
కుమురం భీం జిల్లా చింతగూడ కోయవాగుకు చెందిన మల్లయ్య, రుక్మిణిల కుమారుడు బాలకృష్ణ 4 నెలల క్రితం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. కెరమెరి మండలం టెమ్లాగూడకు చెందిన శంకర్, లాలిబాయిల కుమారుడు సురేశ్ ఇటీవలే బీట్ అధికారిగా నియమితుడయ్యాడు. ఖర్జెల్లి రేంజ్ పరిధిలో సహోద్యోగులతో కలిసి విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ, సురేశ్ ఆదివారం శివపెల్లి ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రాణహిత నది దాటేందుకు వారు నాటు పడవను ఆశ్రయించారు. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెంరేవుకు రాగానే ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. పడవలో ఉన్న వారు సురక్షితంగా బయటపడగా... బీట్ అధికారులు బాలకృష్ణ, సురేశ్ మాత్రం గల్లంతయ్యారు.
ఎన్డీఆర్ఎఫ్కూ దొరకని ఆచూకీ..
సమాచారం అందుకున్న వెంటనే నది మొత్తం జల్లేడ పట్టినా ప్రయోజనం లేకపోయింది. తమ వాళ్లు ప్రాణాలతో వస్తే బాగుండు అంటూ రాత్రంతా కుటుంబ సభ్యులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా.. మృతదేహాలను వెలికితీయలేకపోయింది. చేపల వేట కోసం జాలర్లు వేసిన వలలో ఇద్దరి మృతదేహాలు చిక్కాయి. విగత జీవులుగా బయటకొచ్చిన తమ వారిని చూసిన కుటుంబ సభ్యుల రోదన.. ఆ ప్రాంతానంతా విషాదఛాయలు అలముకునేలా చేసింది.
నిరుపేద కుటుంబాల నుంచి..
నిరుపేద కుటుంబాలకు చెందిన బాలకృష్ణ, సురేశ్లు అహోరాత్రులు శ్రమించి ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన బాలకృష్ణ, సురేశ్ విధుల నిమిత్తం ఒకే గదిలో ఉంటూ.. తక్కువ కాలంలోనే మిత్రులయ్యారు. బాలకృష్ణకు భార్య, ఆర్నెళ్ల బాబు ఉన్నాడు. సురేశ్ భార్య ప్రస్తుతం గర్భంతో ఉంది. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నామనుకుంటుండగానే పడవ ప్రమాదం రూపంలో మృత్యువు కబళించివేసింది.
ఇవీచూడండి: 'ప్రాణహితలో గల్లంతయిన మృతదేహాల వెలికితీత'