ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మట్టితోనే అక్రమార్కులు లక్షల ఆదాయం గడిస్తున్నారు. నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికి అడ్డుకట్ట పడటం లేదు. కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల వ్యాపారం సాగుతోంది.
అధికారుల నిర్లక్ష్యం.. దళారుల ఇష్టారాజ్యం..
కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఈవ్యాపారం వర్ధిల్లుతోంది. అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తుండటం వల్ల దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనుమతుల పేరిట అవసరానికి మించి తరలిస్తున్నారు. వీటికి లెక్కాపత్రం లేదు.
అనుమతులు ఓ చోట.. తవ్వకాలు మరోచోట
ఆరు రోజులు అనుమతి తీసుకున్న జేసీబీల యజమానులు రెట్టింపు రోజులు తవ్వకాలు చేస్తున్నారు. ఇలా జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కారేపల్లి మండలంలో అనుమతులు ఓ చోట.. తవ్వకాలు మరోచోట చేపట్టడం వివాదాస్పదంగా మారింది. కొణిజర్ల, చింతకాని, తల్లాడ మండలాల్లో అధికారులకు మట్టి తవ్వకాలపై ఫిర్యాదు వచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. రైతుల పేరుతో పొలాల్లో మట్టి పోసుకోవాలని దరఖాస్తులు చేసుకుంటున్నా అనుమతులు వచ్చిన తర్వాత పొలాల్లో పోసిన దాఖలాలు కనిపించడం లేదు.
రాత్రిపూట తవ్వకాలు
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మట్టి తవ్వకాలు చేయాల్సి ఉండగా అర్దరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కారేపల్లి మండలానికి 5 కి.మీ. దూరం నుంచి ఎటుచూసినా పెద్దపెద్ద గుట్టలు దర్శనమిస్తుండేవి. ప్రస్తుతం వాటి ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. అక్రమార్కులు కొంతకాలంగా పకడ్బందీగా తవ్వకాలు సాగిస్తున్నారు. మండలంలో కొందరు దళారులు ఓ గ్రూపుగా ఏర్పడి ఈ తంతును కొనసాగిస్తున్నారు. పగలు అధికారుల నిఘా ఉండటం వల్ల.. రాత్రిపూట రహస్యంగా తవ్వుతున్నారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు