ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మార్కెట్లో 15రోజుల కిందట ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. పలువురు రైతులు తమ పంటను తీసుకొచ్చారు.
నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
ఆర్భాటంగా ఏర్పాటు చేశారు కానీ నత్తనడకన కొనుగోళ్లు జరుగుతున్నాయి. 15 రోజుల్లో ఇక్కడ కేవలం ఎనిమిది మంది రైతుల నుంచి 4419 బస్తాల ధాన్యమే కొనుగోలు చేశారు. అంతకుముందు కొన్న 3,086 బస్తాల ధాన్యం కూడా మిల్లులకు రవాణా చేయలేదు.
నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన రైతులు
మార్కెట్కు తీసుకొచ్చి వారం అవుతున్నా.. కొనుగోళ్లు జరగలేదు. ఓపిక నశించిన రైతులు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రోడ్డెక్కారు. స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సి.ఎస్.డి.టి. విజయ్ బాబు, పోలీసులు అక్కడకు చేరుకొని సాధ్యమైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలు శాంతించారు.
అన్నదాతలకు షాకిచ్చిన పోలీసులు
రైతుల ఆందోళన వల్ల ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ అభియోగం కింద 13 మంది రైతులపై పోలీసులు సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు. తమ ఆక్రోశం తెలియజేయడం కోసం ఇలా ధర్నాకు దిగితే... కేసులు పెట్టడం దారుణమని పోలీసులపై మండిపడుతున్నారు.
రాజకీయ పార్టీల సంగతేంటి..?
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న రాస్తారోకోలపై ఎన్ని కేసులు నమోదు చేశారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.
ఖమ్మం జిల్లాలో రైతులపై గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. మిర్చి ధర పతనంపై రైతులు ధర్నా చేసినందుకు.. కేసులు పెట్టి అన్నదాతకు ఉక్కు సంకెళ్లు వేసి జైలుకు తరలించారు. ఈ ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది.
ఇవీ చూడండి: మీది ప్రేమేనా... ఓ సారి ఆలోచించుకోండి!