కరీంనగర్ జిల్లా గొడిశాలలో పత్తి తీసే యంత్రాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ప్రారంభించారు. గతంలో తాను వ్యవసాయ యాంత్రీకరణను అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దానికి భిన్నంగా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
యాంత్రీకరణ తప్పదు
గతంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, కంప్యూటర్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు ఉపాధి కోల్పోతారంటూ కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా ఆందోళనలో పాల్గొన్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయానికి యాంత్రీకరణను జోడించకపోతే ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని వెల్లడించారు.
ఫలితాలు బాగుంటే..
రాష్ట్రంలోనే తొలిసారిగా నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచితంగా పది యంత్రాలను అందజేస్తున్నామని ఉపాధ్యక్షులు అన్నారు. ఫలితాలు బాగుంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ యంత్రాలను అందజేయనున్నట్లు వివరించారు.
యంత్ర పరిశీలనలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కుమార్, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా దెబ్బకు గురుకులాల వంట సిబ్బంది విలవిల