కొత్తగా వేసిన రహదారి.... కొన్ని రోజులైనా బాగుంటాయని భావిస్తాం. కానీ అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం, నాసిరకం పనులతో కొంత కాలానికే రోడ్లు పాడైపోయాయి. కంకర పైకి తేలి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్మార్ట్సిటీ నిధులతో కరీంనగర్లో కొత్తగా రహదారులు వేస్తున్నారు. ఆరు నెలల క్రితం కలెక్టరేట్ మార్గంలో వేయగా... నగరంలో పలుచోట్ల పనులు ఇంకా జరుగుతున్నాయి. కలెక్టరేట్ మార్గంలో వేసిన రోడ్డు అప్పుడే పాడై పోయి... మరమ్మతు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
నగరంలో రూ.196 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో... దశలవారీగా రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రతిమ మల్టీప్లెక్స్ నుంచి కలెక్టరేట్ మీదుగా అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్మాణం పూర్తైంది. కిసాన్నగర్ నుంచి గాంధీరోడ్డు, కట్టరాంపూర్, రాంచంద్రపురం నుంచి బైపాస్ రోడ్డుతో పాటు శాతవాహన వర్సిటీ ప్రాంతంలో టవర్ సర్కిల్ ప్రాంతంలో రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇంకా గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు కాలేదు. కానీ రోడ్డు పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది.
కొరవడిన పర్యవేక్షణ
నగరంలో కోట్ల రూపాయల పనులు జరుగుతున్నప్పుడు నిత్యం పర్యవేక్షించాల్సి ఉన్నా .... అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ వెళ్లే మార్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇతర మార్గాల్లో పరిస్థితి ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు.
ఇబ్బంది లేదు..
రహదారి నిర్మాణంలో నాణ్యతకు ఇబ్బంది లేదని కరీంనగర్ మేయర్ సునీల్ రావు చెబుతున్నారు. రహదారి నిర్మిస్తున్నప్పుడు వినియోగించిన వైబ్రేటర్ వల్ల ఇలాంటి సమస్య ఏర్పడిందని గుత్తేదారులు సమాధానం ఇచ్చారని చెప్పారు. రెండేళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత గుత్తేదారుకే ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చేపట్టే రహదారి నిర్మాణాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ పేరుతో మత్తు మందు ఇచ్చి నగలు కాజేసింది