వ్యవసాయ రంగంపై కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు రూ. 1,200 కోట్ల మేర నష్టపోతున్నారని ఆగ్రహించారు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి. కనీస మద్దతు ధర కల్పించిన తర్వాత వ్యవసాయ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత్రిత సాగుతో సన్నరకం ధాన్యం ఎకరాకు 25 క్వింటాలు మించి ఉత్పత్తి అయ్యే అవకాశం లేదన్నారు.
రూ. 2,500 మద్దతు ధర ఇవ్వాలని కోరినా... ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తోడు దొంగలుగా మారాయని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టంపై పార్లమెంట్లో తెరాస అటూ ఇటూ కాకుండా వ్యవహరించిందని విమర్శించారు.
చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వ్యతిరేక తీర్మానం చేసి పంపించాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలుపు తథ్యం: కేటీఆర్