ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈటల దిల్లీలో తాకట్టు పెట్టారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. భాజపాలో చేరడానికి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారంటే ఆయన వద్ద ఎన్ని డబ్బులున్నాయో అర్థమవుతుందన్నారు. హుజూరాబాద్లో జరిగిన పట్టణ స్థాయి తెరాస కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'తెలంగాణలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఏ ఎమ్మెల్యే అడిగినా ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారు. కానీ మొన్నటివరకు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ మాత్రం నిధులు అడగలేదు. ఆరుసార్లు గెలిపించినా ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించడం లేదు. మంత్రిగా తన భూములు క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రిని కలిశారే తప్ప.. హుజూరాబాద్ అభివృద్ధికి ఏనాడూ ఆయన కృషి చేయలేదు'. -రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్లోనే ఉంటాం..
నేటి నుంచి ఉప ఎన్నిక ముగిసే వరకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ సునీల్రావుతో పాటు తానూ హుజూరాబాద్లోనే ఉంటానన్నారు. ముఖ్యమంత్రిని కలిసి అవసరమైన నిధులు తీసుకొచ్చి గతంలో కంటే వెయ్యిరెట్లు ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ... హుజూరాబాద్ ప్రజలంతా తెరాస వైపే ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు, హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గందె రాధిక పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి