నేటి రోజుల్లో ఊరన్నాక ఆస్పత్రి, బడితో పాటు ఎన్నో వసతులు ఉండాలి. వాటిలో గుడి, బస్టాండు ఎంతో అవసరం. అన్ని సౌకర్యాలకు అధికారుల చుట్టూ తిరిగి... తెలిసిన ప్రతి ప్రజాప్రతినిధికి విజ్ఞప్తులు చేస్తూ ఎన్నేళ్లు ఎదురుచూస్తాం ఆనుకున్నారు ఆ మిత్రులు. తమ సొంత ఖర్చులతో గ్రామంలో బస్టాండు నిర్మించిన వారు ఒకరైతే... శిథిలమైపోతున్న దేవాలయాన్ని పునర్నిర్మించారు ఇంకొకరు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మహారాష్ట్ర.. కర్ణాటక సరిహద్దు మండలం. అయితే గత కొన్నేళ్లుగా మద్నూర్ జాతీయ రహదారి పాత బస్టాండ్ ప్రాంతంలో బస్ షెల్టర్లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండా... వానల్లో తడుస్తూ నిరీక్షించేవారు. ప్రయాణికుల ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన... మద్నూర్కు చెందిన ఉస్కల్వార్ శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో షెల్టర్ నిర్మించారు. స్థానికంగా ఓ పత్తి మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్న శ్రీనివాస్... మూడు లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు.
అదే గ్రామానికి చెందిన కృష్ణ పటేల్ కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన రాణేమ్మ దేవాలయాన్ని తన సొంత ఖర్చులతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు.. అని వేచి చూడకుండా తమవంతు సాయంతో సమాజంకోసం పాటుపడుతున్న వారి సేవలు ఎందరికో ఆదర్శం.
ఇదీ చూడండి: ప్రజల వద్దకే పాలన... మంత్రి అజయ్ మార్నింగ్ సైక్లింగ్!