కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పెట్ సంగ్యం శివాలయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తంచేశారు. లాక్డౌన్ కొనసాగుతున్న కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జీతభత్యాల్లో 50 శాతం కోత విధించడం బాధాకరమని ప్రణీత్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వం మే నెల నుంచైనా ప్రతి ఉద్యోగికి పూర్తి వేతనం అందించాలని జేఏసీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు సిద్ధిరాములు, మధుసూదన్, మల్లికార్జున్, పెన్షనర్ సంగయ్య తదితరులు పాల్గొన్నారు.