నియంత్రిత సాగు విధానంపై గ్రామాల్లో రైతులకు వివరించేందుకు కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. ఒక మండలంలో నాలుగు క్లస్టర్లు ఉంటే రోజుకో క్లస్టర్ చొప్పున సమావేశం నిర్వహించనున్నారు. వాటి సంఖ్య ఎక్కువుంటే రోజుకు రెండింటి సమావేశాలు పెట్టాలని ప్రణాళిక రూపొందించారు. సమావేశాలకు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు హాజరు కానున్నారు.
నేల స్వభావం, సాగునీటి లభ్యత, ఆయా పంటల సాగు విస్తీర్ణం ఆధారంగా ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో పంటలు వేయాలో నిర్ణయించనున్నారు. అందుకు సరిపడా విత్తనాలు, ఎరువులు ముందుగానే సహకార సంఘాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటారు. క్లస్టర్ల వారీగా సమావేశాల అనంతరం మండలాల వారీగా వ్యవసాయ కార్డును రూపొందించి ఆయా పంటల ప్రణాళికకు అనుగుణంగా సాగుచేసేలా పంటల వివరాలు నమోదు చేస్తారు.
ప్రణాళికకు ఆమోదం లభించింది
నియంత్రిత పద్ధతితో రూపొందించిన జిల్లా ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా క్లస్టర్ల వారీగా ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తాం. వరి వేసే రైతులు యాభైశాతం సన్నాలు సాగు చేయాలి. మక్క సాగును ఆపేసి బదులుగా పత్తి, సోయా, కంది సాగుచేయాలని నిర్ణయించాం.
- నాగేంద్రయ్య, జిల్లా వ్యవసాయాధికారి, కామారెడ్డి