జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు పుల్లూరు నాగేశ్వర్ రెడ్డి పై పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఖండించారు. పుల్లూరు గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి ఎరువుల కొనుగోలు కోసం పుల్లూరు చెక్పోస్టు మీదుగా అలంపూర్ వెళ్తుండగా పోలీసులు నాగేశ్వర్ రెడ్డిని ఆపి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.
పెద్దమనిషి అని చూడకుండా కొట్టారని పేర్కొన్నారు. బాధ్యత గల పోలీసులు ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో ఇలా చేసినట్లు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా పోలీసులు అధికారులకు సంపత్ కుమార్ సూచించారు.