పిల్లలు బడికి... పెద్దలు పనికి అంటూ ప్రభుత్వాలు.. స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రచారం చేస్తున్నా కొందరిలో మార్పురావడం లేదు. ఆర్థికి పరిస్థితుల వల్లనో... ఇతర కారణాలతో బడిఈడు బాల్యం పంటపొలాల్లో మగ్గుతోంది. జోగులాంబ జిల్లాలో ఏటా పత్తి సీజన్ వచ్చిందంటే బడులు ఖాళీ అవుతున్నాయి. పుస్తకాల సంచితో బడికెళ్లే పిల్లలంతా పొలంబాట పడతారు.
దేశంలో అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి అధికం. 50వేల హెక్టార్లలో సాగవుతుంది. జూన్, జూలైలో విత్తనం వేస్తే ఆగస్టులో క్రాసింగ్ చేయడానికి, మొగ్గలు తుంచడానికి పెద్దఎత్తున కూలీలు అవసరమవుతారు. ఆసమయంలో కూలీ రేట్లు తట్టుకోలేక పిల్లలతో సహా కుటుంబమంతా పనిచేయాల్సిన పరిస్థితి.
పత్తి పనుల కారణంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం పడిపోతుంది. సాధారణ రోజుల్లో 85శాతం ఉంటే.. ఈ సీజన్లో 60శాతమే. కొందరు విద్యార్థులైతే బడి మానేస్తారు. ఇలా విత్తనపత్తి పిల్లల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలగకుండా చేస్తోంది.
అప్పులు తీర్చేందుకు తప్పని తిప్పలు
విత్తనపత్తి సాగు కోసం రైతులు ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల నుంచి అప్పులు తీసుకుంటారు. వాటిని తీర్చాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి. అందుకే ఇంటిల్లిపాది విత్తనపత్తి కోసం పనిచేస్తారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఉన్నత చదువులు అందుబాటులో లేవు. ఫలితంగా చదువు కంటే పనే మేలనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది.
చీకటి జీవితాల్లో చిరు దివ్వెలా..
జిల్లాలో అక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎంవీ పౌండేషన్ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. పిల్లలకు ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి... అన్ని వసతులు కల్పిస్తూ బ్రిడ్జి కోర్సు అందిస్తోంది. పిల్లలు ఎక్కడ చదువు ఆపేసారో తెలుసుకుని కేజీవీబీల్లో చేర్చుకుని చదువు చెప్పిస్తున్నారు.
ఫలించని ప్రయత్నాలు..
ప్రభుత్వశాఖలు ఏటా బడి బయట పిల్లలను తిరిగి బళ్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదు. విద్యాశాఖ, కార్మిక శాఖ, రెవిన్యూ, వ్యవసాయశాఖ, పోలీసుశాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖ నిరంతరం పనియాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా వచ్చే ఈ సమస్యపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకుంటే పత్తి సాగు పెరిగే కొద్దీ.. పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య మరింతగా పడిపోతుంది.
ఇదీ చూడండి: శివానుగ్రహం పొందాలంటే.. ఇలా చేయండి