శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం ప్రస్తుతం 850 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రానికి నిల్వ 80.90 టీఎంసీలుగా నమోదైంది. జూరాలకు ఎగువ నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కులు, విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ల నుంచి 35 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల జలాశయం నుంచి 11 వేలు, హంద్రీ నది నుంచి ఐదు వేలు, ఇతరత్రా కలిపి మొత్తంగా 75 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోంది. తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ల నుంచి 38,140 క్యూసెక్కులు నాగార్జుసాగర్లోకి వదులుతున్నారు.
'ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహం తగ్గింది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత వరదతో కలిపి గోదావరిలో 7.81 మీటర్ల మట్టం నమోదవుతుండగా 1.60 లక్షల క్యూసెక్కులు లక్ష్మీ బ్యారేజీకి చేరుకుంటోంది. బ్యారేజీ 63 గేట్లు ఎత్తి 1,27,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నామని' అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి బ్యారేజీలో నీటి నిల్వ 12.79 టీఎంసీలకు చేరినట్టు చెప్పారు.
ఇదీ చదవండిః కొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే