MAHASHIVARATRI CELEBRATIONS: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణలతో ఆలయప్రాంగణాలు మార్మోగిపోయాయి. ప్రధాన శైవ క్షేత్రాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయంలో నూతన మహామండపాన్ని, కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పాలకుర్తిని పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం కేసీఆర్ హయంలోనే పాలకుర్తి రూపురేఖలు మారాయి. 100 కోట్లతో పాలకుర్తి నలుమూలల డబుల్ రోడ్లు మంజూరు చేశారు. సీఎం నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని జనగాం జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
![Minister Errabelli couple conducting pujas at Sri Someshwara Lakshmi Narasimha Swamy Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14602320_minister.png)
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేసి పువ్వులు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
హన్మకొండ జిల్లాలో ఘనంగా శివరాత్రి వేడుకలు
హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు సమర్పించి స్వామి వారికి మొక్కులు చెల్లిస్తున్నారు.
అనంతరం ఆలయ ఆవరణంలోని కల్యాణ మండపంలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేశారు. కార్యక్రమం పూర్తయి ఒక గంట గడిచినా ఆలయ నిర్వాహకులు సకాలంలో హాజరు కాకపోవడంతో భక్తులు గంటల తరబడి వేచి చూశారు. ఆలయ నిర్వాహకులకు తోడు పోలీసులు చర్యల వల్ల భక్తులు అసహనానికి గురై ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుని పెద్దపట్నం తొక్కేందుకు ఎగబడ్డారు. దాంతో స్వల్ప ఉద్రిక్తతల నడుమ ఈ ఘట్టం ముగిసింది.