వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున నిర్ణీత లక్ష్యం మేరకు అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అజీం అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి క్లబ్ హౌజ్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిరుపేద రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. వారికి సకాలంలో పంట రుణాలు అందించి సాగు చేసుకునేందుకు సహకరించాలని బ్యాంకర్లను ఆదేశించారు.
ఆయా మండలాల తహశీల్దార్లు మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ క్షేత్రాల్లో మోకాపై ఉన్న రైతులను గుర్తించి పట్టాదారు పాసు పుస్తకాలు త్వరగా అందించాలని, నకిలీ పట్టాదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలా చేయడం వల్ల అర్హులైన రైతులకు పంటరుణం తొందరగా, సక్రమంగా అందుతుందని అన్నారు.
భూమి లేకుండా పంటరుణాలు పొందిన వారిని గుర్తించి వారి నుంచి అపరాధ రుసుముతో రుణాలను రికవరీ చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో మూడు నెలలుగా ఉపాధి లేక రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున గతంలో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావును సూచించారు. భూపాలపల్లి పట్టణంలో బ్యాంకుల చెస్ట్ బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలం అందించేందుకు చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఆర్డీవో వైవీగణేష్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ నగేష్, ఏడీఏ సత్యంబాబు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్మెన్కు కరోనా పాజిటివ్