జనగామ మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో జులైలో మొత్తం 400 ప్రసూతి కాన్పులు జరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు తెలిపారు. ఇది ఆసుపత్రిలో రెండోసారి వరుసగా నమోదైన ప్రసూతి కాన్పుల రికార్డు అన్నారు. మే, జులై నెలల్లో 400 మందికి ప్రసూతి కాన్పులు చేశామన్నారు.
ప్రతి నెలా సగటున ఆసుపత్రిలో 320 నుంచి 350 వరకు కాన్పులు జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. మెరుగైన సేవలను అందిస్తున్న ఆసుపత్రిలోని గైనకాలజీ, మత్తు, పిల్లల వైద్యులతో పాటు అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బందిని డాక్టర్ రఘు అభినందించారు.