ధాన్యం కొనుగోళ్లు అయిన తర్వాత అదనపు తూకం వేసిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించడం విడ్డూరంగా ఉందని జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అదనంగా తూకం వేసిన రైతులకు మిల్లర్ల నుంచి తిరిగి డబ్బులు ఇప్పిస్తే తాను పాలాభిషేకం చేస్తానని సవాల్ విసిరారు.
ఆ ప్రాజెక్టులు ఎందుకు నింపలేదు ?
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు రెండు టీఎంసీల నీరు ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. మూడో టీఎంసీ కోసం వేల కోట్లు ఖర్చు చేసి అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని జీవన్రెడ్డి విమర్శించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి 58 టీఎంసీలు మాత్రమే ఎత్తి పోశారని.. రోహిణి కార్తెలో సాగునీరు ఇస్తామని చెప్పి ఇంత వరకు పంపింగ్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.
ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండీలో నీరు ఎందుకు నింపలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన నూతన సాగు విధానంతో రైతు అయోమయానికి గురవుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికీ సోయా విత్తనాలు మొలకెత్త లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.25 వేలపైన రుణం ఉన్న రైతులకు రుణమాఫీ విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : ప్రొఫెసర్ జయశంకర్ సేవలను మర్చిపోం: సీఎం కేసీఆర్