సుమలత తల్లిదండ్రులు వెంకటరెడ్డి, వెంకటలక్ష్మి వ్యవసాయం చేసేవారు. ఏపీ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారంలో తమకున్న మూడెకరాల పొలంలో మిరప పంట పండించేవారు. వీరి ముగ్గురు సంతానంలో సుమలత పెద్దది. తాము చదువుకోకపోయినా పిల్లలను చదివించాలనుకునే ఆ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితీ అంతంతమాత్రమే.
నాన్నలాంటి రైతుల కోసం..
వర్షాభావం, ప్రకృతి విపత్తులు పంటని నాశనం చేసినప్పుడు అమ్మానాన్న ఎంతగా కుమిలిపోయేవారో సుమలత చూసేది. ‘ఎందుకు నాన్నా తిరిగి అదే వ్యవసాయం చేస్తావ’ని అడిగితే.. ‘భూమిని నమ్ముకున్నవాడికి ఆ పని తప్ప వేరే పని తెలీదు తల్లీ’ అనే తండ్రికి ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు సుమలతకు. తండ్రిలాంటి ఎందరో రైతుల కష్టాలను చూస్తూ పెరిగిన ఆమె వాటిని తీర్చే దిశగా ఏదైనా చేయాలనుకుంది. వ్యవసాయ రంగంలోనే పరిశోధనలు చేయాలనుకుంది.
బంతిపూల మీద పరిశోధనలు...
డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రైల్వే కోడూరులో బీఎస్సీ హార్టికల్చర్ను చదివింది సుమలత. తర్వాత ఉత్తరాఖండ్లోని జి.బి.పంత్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివింది. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి పీహెచ్డీలో చేరింది. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్లో బంతిపూల మీద పరిశోధన మొదలు పెట్టింది.
అత్యుత్తమ పరిశోధన...
రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేపట్టే పీహెచ్డీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా కొద్దిమందికి మాత్రమే అందించే ప్రధానమంత్రి ఫెలోషిప్ ఫర్ డాక్టొరల్ రీసెర్చ్కి దరఖాస్తు చేసింది. కెరొటినాయిడ్ ఎక్కువ ఉండే బంతి విత్తనాలపై అత్యుత్తుమ పరిశోధన చేపట్టినందుకు ఈ ఫెలోషిప్కు ఎంపికైంది సుమలత. ఏటా 10.91 లక్షల రూపాయల చొప్పున నాలుగేళ్లపాటు ఈ ఉపకారవేతనానికి అర్హురాలైంది.
నా పరిశోధనల ఫలితంగా అతితక్కువ ఖర్చుతో బంతి హైబ్రిడ్ విత్తనాలు తయారవుతాయి. బంతి మొక్క సాధారణంగా రెండున్నర రూపాయలుంటుంది. నేను చేస్తున్న ఈ విధానంలో ఒక మొక్క రూపాయికే వస్తుంది. దీంతో రైతుకు పెట్టుబడి చాలా తగ్గుతుంది. వివిధ వర్ణాల్లో వచ్చే పూలను వస్త్ర, రంగులు తయారుచేసే సంస్థలకు కూడా లాభానికి అమ్ముకోవచ్చు.
- సుమలత
- ఇదీ చూడండి : బ్యాంకులో దొంగతనం చేస్తుండగా దొరికిపోయారు.!