భయమో, జాగ్రత్తో..! మొదటి దశ కరోనా నుంచి చాలా మంది తప్పించుకున్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. రెండో దశలో కళ్లు మూసి తెరిచేలోగా...వేలాది మందిని అంటుకుంటోంది వైరస్. వీరిలో పెద్దలే కాదు... చిన్నారులూ ఎక్కువగానే ఉంటున్నారు. సెకండ్ వేవ్లో ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది...ఈ పరిణామమే. మొదటి దశలో పిల్లలపై పెద్దగా ప్రభావం చూపని కొవిడ్.. ఇప్పుడు వారిపైనా విరుచుకుపడుతోంది. గతేడాదితో పోల్చితే ఈ కేసుల సంఖ్య రెండింతలుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఎక్కువగా కరోనా దాడి చేస్తోంది. 1–8 మధ్య వయసున్న వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు చెబుతున్న జాగ్రత్తలేంటి?
అధికారిక గణాంకాలు లేవు
నెలల వయసున్న పిల్లల దగ్గర్నుంచి దాదాపు 14 ఏళ్ల వయసున్న చిన్నారుల దాకా ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. తద్వారా వారిలో తక్కువ, మధ్య స్థాయి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గతేడాది కూడా పిల్లలకి కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు లేకపోవడం వల్ల... ఆ వార్తలు పెద్దగా బయటకి రాలేదు. కరోనా వారికి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలిసే అవకాశం లేదంటున్న వారూ ఉన్నారు. గతేడాది చిన్నపిల్లల్లో 1 శాతం మందికి కరోనా సోకితే, ఈ సారి 1.2 శాతం మందికి సోకింది. శాతాల్లో చూస్తే తక్కువగానే కనిపించినా సంఖ్యలో ఇది చాలా ఎక్కువ. ప్రభ్వుత్వం పిల్లల్లో కరోనాకి సంబంధించి ఎలాంటి అధికారిక గణాంకాలు విడుదల చేయడం లేదంటున్నారు..పలువురు నిపుణులు.
భిన్నంగా లక్షణాలు
కరోనా వైరస్ తొలి నాళ్లలో శ్వాస వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపినా.. ఇప్పుడు శరీర అవయవాలన్నింటినీ తన అధీనంలోకి తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో రోజుకో కొత్త లక్షణం బయటపడుతోంది. పెద్దలతో పోల్చితే పిల్లల్లో ఈ వైరస్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయని హార్వర్డ్ హెల్త్లో ప్రచురితమైన ఓ నివేదిక చెబుతోంది. ఇందులో భాగంగా కొంతమంది చిన్నారుల్లో అసలు లక్షణాలేవీ కనిపించట్లేదని, మరి కొంతమందిలో కొన్ని అనారోగ్యాల ద్వారా కొవిడ్ సోకిందని అనుమానించి పరీక్ష చేయించాలని సూచిస్తోంది. మరి చిన్నారులకు కరోనా సోకిందని ఎలా తెలుస్తుంది..? ఏయే లక్షణాలుంటే... వైరస్ బారిన పడ్డారని అనుమానించాలి..? వారిని వైరస్ బారి నుంచి బయటపడేయాలంటే... ఏం చేయాలి?
న్యుమోనియాకు దారి
103-104 డిగ్రీల ఫారన్ హీట్ శరీర ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం ఉండి.. నాలుగైదు రోజుల పాటు ఇలాగే కొనసాగితే... అది కరోనా లక్షణంగా భావించాలంటున్నారు వైద్యులు. జ్వరంగా ఉందనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం వారి శరీర ఉష్ణోగ్రత, బీపీ, ఆక్సిజన్ స్థాయుల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆకలి మందగించడం, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు, కంటి ఇన్ఫెక్షన్, రక్తనాళాల్లో వాపు, పొడి దగ్గు, గొంతునొప్పి రుచి, వాసన కోల్పోవడం, పెదాలు పగలడం, ఎరుపెక్కడం, ముక్కుదిబ్బడ ఎక్కువ రోజుల పాటు కొనసాగడం లాంటివి కనిపించినా... కరోనా పరీక్ష చేయించాలి. కొంతమంది చిన్నారుల్లో ఎక్కువ రోజుల పాటు వేధించే జలుబు క్రమంగా న్యుమోనియాకు దారి తీస్తుందట. అందుకే.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
ప్రవర్తనను బట్టి గుర్తించాలి
ఇలాంటి లక్షణాలైతే కాస్త పెద్ద వయసున్న పిల్లలు చెప్పగలుగుతారు. అదే పసి పిల్లలైతే తల్లులే వారి ప్రవర్తనను బట్టి గుర్తించాలంటున్నారు నిపుణులు. వారు నిరంతరం ఏడుస్తున్నా, ఎంతగా ఊరుకోబెట్టినా ఫలితం లేదనుకుంటే వారి శరీరంలో అసౌకర్యంగా ఉందని గుర్తించాలట. ఇక సరిగ్గా తినకపోయినా, తినిపించడానికి ప్రయత్నిస్తే వికారం చెందినా రుచి, వాసన కోల్పోయినట్లు అనుమానించి పరీక్ష చేయించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇక పసి పిల్లలకు పాలిచ్చే తల్లికి వైరస్ సోకితే పాలివ్వాలా? వద్దా? అన్న అనుమానం అక్కర్లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే తల్లిపాల ద్వారా చిన్నారులకు వైరస్ సోకినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, తల్లి పాలలో వైరస్ ఉండదని.. అందుకే తల్లులు పిల్లలకు నిరభ్యంతరంగా పాలివ్వచ్చంటున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
రెండో దశ కొవిడ్ చాలా మంది పిల్లలకు సోకుతున్నా, వారిలో ఎక్కువ మందిలో లక్షణాలు లేకపోవడం, ఒకవేళ ఉన్నా తక్కువ, మధ్య స్థాయిలోనే కనిపించడం వల్ల అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. లక్షణాలు వారిలో కనిపించినా, వారికి దగ్గరగా మెలిగిన కుటుంబ సభ్యులకు వైరస్ సోకిందని నిర్ధరణ అయినా.. పిల్లలకూ కొవిడ్ పరీక్ష చేయించడం ఉత్తమం అంటున్నారు. తద్వారా వైరస్ ఉందని తెలిస్తే... తీవ్రతను బట్టి హోమ్ ఐసోలేషన్లో ఉంచాలా? లేదంటే ఆస్పత్రిలో చేర్చాలా? అన్న విషయం వైద్యులు నిర్ణయిస్తారు. కొవిడ్ బారిన పడిన చిన్నారుల విషయంలోనైనా, వారిని ఈ వైరస్ బారి నుంచి కాపాడాలన్నా తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
ఇండోర్ గేమ్స్కే ప్రాధాన్యత
పిల్లలకు నిరంతరం మాస్క్ పెట్టే ఉంచాలి. వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, ఇంటా-బయటా సామాజిక దూరం పాటించడం.. తద్వారా వైరస్కు దూరంగా ఉండచ్చన్న విషయం వారికి వివరించాలి. వారికిచ్చే ఆహారంలో బీ కాంప్లెక్స్, సీ, డీ విటమిన్లు, జింక్, క్యాల్షియం, ప్రో బయాటిక్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు.. మొదలైన పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇది వైరస్ సోకిన పిల్లలు క్రమంగా కోలుకునేలా చేస్తుంది. అలాగే వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించి, వైరస్ బారిన పడకుండా ఉండేందుకూ దోహదం చేస్తుంది. ఆడుకోవడానికి బయటకి వెళ్లనివ్వకూడదు, ఇండోర్ గేమ్స్కే ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పటి వరకు పిల్లల కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా వారికి సీజనల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి : 40 ఏళ్లలోపు వారే లక్ష్యంగా కొవిడ్ కాటు