హైదరాబాద్ లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో వాకర్స్, స్థానికులు ఆందోళన నిర్వహించారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్నామని... వాకింగ్ ట్రాక్ నిర్మించాలని అధికారులను ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల కోసం వాకింగ్ ట్రాక్ నిర్మించని అధికారులు... స్విమ్మింగ్ పూల్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు.
అలాగే స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తే... మైదానం కుచించుకుపోయి వాకింగ్కు, వివిధ రకాల వ్యాయామాలకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. పోలీస్ ఉద్యోగాలతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత ఇక్కడే రన్నింగ్, వ్యాయామాలు చేస్తుంటారని అన్నారు. తాము అభివృద్ధి పనులను అడ్డుకోమని.. కాకపోతే స్విమ్మింగ్ పూల్ను మరోచోట నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. లేదు ఇక్కడే నిర్మిస్తామంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వాకర్స్, స్థానికులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తే ఏమవుతుందో తెలుసా?