సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వస్తోంది. ఏడు కీలక విశ్వవిద్యాలయాల ఎంపిక కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేడ్కర్, తెలంగాణ, మహాత్మగాంధీ యూనివర్సిటీల ఎంపిక కమిటీలు కసరత్తు పూర్తి చేశాయి. ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్ల చొప్పున ప్రభుత్వానికి పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదిస్తే.. వాటిని గవర్నర్ కార్యాలయానికి పంపించనున్నారు. గవర్నర్ వారిని ఖరారు చేస్తారు.
కమిటీ అవసరం లేకుండానే
పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందునందున ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నాలుగైదు రోజుల్లోనే వీసీల నియామక ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ రోజైనా ప్రకటన రావచ్చన్న ఉద్దేశంతో యూనివర్సిటీ వీసీల కార్యాలయాలను ఇప్పటికే ముస్తాబు చేశారు. పాలమూరు యూనివర్సిటీ సమావేశం... సోమ లేదా మంగళవారంలో జరిగే అవకాశముంది. బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్సిటీకి ఎంపిక కమిటీ అవసరం లేకుండానే నేరుగా వీసీని నియమించే అధికారం... ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీ నియామకానికి కొంత సమయం పట్టొచ్చని ఉన్నత విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మార్పుపై భిన్న వాదనలు
తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎంపిక కమిటీ సభ్యుడిని అకస్మాత్తుగా మార్చడం విద్యా శాఖలో చర్చనీయాంశమైంది. తెలుగు వర్సిటీ ఈసీ నామినీగా ఉన్న అంబేడ్కర్ యూనివర్సిటీ.. మాజీ వీసీ వీఎస్ ప్రసాద్ను మార్చి ఆ స్థానంలో సులేమాన్ సిద్ధిఖీని నియమించారు. వీసీల నియామక ప్రక్రియ కొలిక్కి వస్తున్న సమయంలో ప్రసాద్ మార్పుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వీలైనంత త్వరగా
తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఎంపిక సందర్భంగా ఉన్నతాధికారుల అభిప్రాయాలకు భిన్నంగా చెప్పినందుకే మార్చినట్లు విద్యా శాఖలో ప్రచారం జరుగుతోంది. యూనివర్సిటీలకు 2019 జూన్ నుంచి.. ఐఏఎస్ అధికారులు ఇంఛార్జీ వీసీలుగా కొనసాగుతున్నారు. కొత్త వీసీల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ 2019 జులైలోనే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. ప్రక్రియ ముందుకు సాగలేదు. వీలైనంత త్వరగా వీసీలను నియమించాలని సూచిస్తూ గవర్నర్ తమిళిసై ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఇదీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలకు సన్నాహాలు