హైదరాబాద్ మత్స్య సొసైటీ డైరెక్టర్ తులసి గంగపుత్ర గురువారం సాయంత్రం అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. సికింద్రాబాద్లోని వారాసిగూడలో నివాసముంటున్న తులసి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల వివిధ మత్స్య మహిళా సొసైటీలు నివాళులు అర్పించాయి.
మహిళా సభ సంతాపం..
నగర మత్స్య సహకార సంఘానికి ఎనలేని సేవలు అందించిన తులసి మరణం పట్ల తెలంగాణ గంగపుత్ర మహిళా సభ అధ్యక్షురాలు అరుణ జ్యోతి బెస్త దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అకాల మరణ వార్త నగర మత్స్య సంఘం మహిళలను తీవ్రంగా కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి వారి కుటుంబం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రెండు దశాబ్దాలుగా తులసితో అనుబంధం ఉందని.. ఆమె లోటును భర్తీ చేయలేమని హైదరాబాద్ మత్స్య సొసైటీ జిల్లా చైర్ పర్సన్ పద్మ తెలిపారు.
శోకసంద్రంలో మత్స్యసొసైటీలు...
తులసి మరణం హైదరాబాద్ గంగపుత్ర మహిళలను శోక సంద్రంలో ముంచెత్తిందని వారాసిగూడ గంగపుత్ర సంఘం మహిళా అధ్యక్షురాలు కూర పద్మ బెస్త విలపించారు. వారాసిగూడ, బొలక్పూర్ , ఖైరతాబాద్, సీతాఫల్ మండి, కుమ్మరిగూడ తదితర మత్స్య మహిళా సొసైటీ నేతలు తమ సహచరిని, స్నేహితురాలిని చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో బస్తీ వాసులు, గంగపుత్రులు, మహిళా మత్స్య సొసైటీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండి: వాటర్ వర్క్స్ అసోసియేషన్ 53వ వార్షిక సమావేశం