శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. గురువారం విడుదల చేసిన 18వేల ఆన్లైన్ టికెట్లు 4గంటల్లోనే అమ్ముడైపోయాయి. తిరుమలకు ఈనెల 11నుంచి సామాన్యులను అనుమతించిన విషయం తెలిసిందే. ముందుగా ఆన్లైన్ ద్వారా రోజుకు మూడు వేలు(ప్రత్యేక ప్రవేశ దర్శనం), ఆఫ్లైన్ ద్వారా మరో 3వేలు(సర్వ దర్శనం)టోకెన్లు జారీ చేయాలని తితిదే అధికారులు నిర్ణయించారు.
ఆన్లైన్లో జూన్ నెల టికెట్లను ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆ తర్వాత 19వ తేది నుంచి రోజుకు మరో 3వేల ఆన్లైన్ టికెట్లు అదనంగా విడుదల చేశారు. ఆఫ్లైన్ ద్వారా ఇస్తున్న టోకెన్లను ఈనెల 26 వరకు జారీ చేశారు. తాజాగా మళ్లీ ఆన్లైన్లో రోజుకు 3వేల వంతున ఆరు రోజులకు 18వేల టికెట్లను గురువారం విడుదల చేయగా 4గంటల్లోనే అయిపోయాయి. అయితే టోకెన్ల జారీపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవటం వల్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈనెెల 27కు సంబంధించిన సర్వదర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం తిరుపతిలోని నిర్ధిష్ట కేంద్రాల్లో జారీ చేయనున్నారు.
ఇవీ చూడండి : తెలంగాణలో మరో 920 కరోనా కేసులు, 5 మరణాలు