రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రేపు, ఎల్లుండి కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఝార్ఖండ్ నుంచి కొంకన్ వరకు చత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 3.1 కిలో మీటర్ల ఎత్తు వద్ద షేర్ జోన్ ఏర్పడిందని వాతావరణం తెలిపింది.