ఒక అభ్యర్థికే రెండు కొలువులు రావడం.. ఇతర శాఖల్లోని ఉద్యోగాలకు ఎంపిక కావడం.. కొన్ని విభాగాల్లో అర్హులైన వారు లేకపోవడం తదితర కారణాలతో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం లేదు. ఇప్పటివరకు టీఆర్టీలో సుమారు 700 మందికి ఉద్యోగాలు దక్కినా చేరలేదు.
స్కూల్ అసిస్టెంట్లలో సుమారు 200 మంది, ఎస్జీటీ తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో 400 మంది వరకు కొలువుల్లో చేరకపోవడం వల్ల ఆ మేరకు పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. ఆ ఖాళీలను విద్యాశాఖ మరో మెరిట్ జాబితా ప్రకటించి భర్తీ చేయడం లేదు. ఫలితంగా మరో టీఆర్టీ ప్రకటన వెలువడే వరకు అవి ఖాళీగానే ఉండనున్నాయి.
తాజాగా ఎస్జీటీ ఆంగ్ల మాధ్యమం కొలువులకు 761 మందికి 559 మంది మాత్రమే చేరడం విశేషం. అంటే 202 మంది ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. అయితే నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టులు, చివరకు చేరిన వారి లెక్కలు చూస్తే ఇప్పటి వరకు 1500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లే. వీటికి తర్వాత మరో మెరిట్ జాబితా ప్రకటించి భర్తీ చేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. పంచాయతీరాజ్ లాంటి శాఖలో ఆ విధానాన్నే పాటిస్తున్నారని వారు ఉదహరిస్తున్నారు.
ఇదీ చూడండి : తెలంగాణ కుంభమేళకు యంత్రాంగం సన్నద్ధం..!