కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల భర్త, కుటుంబసభ్యులు గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరవుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ స్పందించింది. అలా ఎవరైనా సమావేశాల్లో పాల్గొన్నా, నిర్ణయాలు తీసుకున్నా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ చేసిన ఫిర్యాదును గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధుల బదులు భర్త, కుటుంబసభ్యులను అధికారిక సమావేశాలకు అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పంచాయితీరాజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కమిషనర్ కలెక్టర్లకు సూచించారు.
ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారిక సమావేశాల్లో ప్రజాప్రతినిధుల భర్త, కుటుంబసభ్యులు పాల్గొన్నా, నిర్ణయాల్లో భాగస్వామ్యులైనా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు.