శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి 37 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల, నాగార్జునసాగర్ ఎడమకాలువ, ఎ.ఎం.ఆర్.పి, మిషన్ భగీరథ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేయాలని కోరారు.
గతేడాది కేటాయించినా వాడుకోలేకపోయిన 27 టీఎంసీలతో కలిపి ఈ నీటిని కేటాయించాలని కోరినట్లు తెలిసింది. కొద్దిరోజుల క్రితం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా 17 టీఎంసీల నీటిని తమకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. వీటిపై ఒకటి రెండు రోజుల్లో బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నీటి విడుదలను ఆపండి: ఏపీ
శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్ కోరింది. బోర్డు అనుమతి లేకుండా, శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం లేకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తోందని పేర్కొంది. శ్రీశైలం నిర్వహణకు సంబంధించిన జీఓ-69కు భిన్నంగా నీటి విడుదల జరుగుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదీ చదవండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్