ETV Bharat / state

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తెరాస.. నేడు నిరాడంబరంగా వార్షికోత్సవం

గులాబీ జెండా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొంది. మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్ర సృష్టించారు. సొంత రాష్ట్రంలో స్వీయ అస్థిత్వం పేరిట తిరుగులేని రాజకీయ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితిని తీర్చిదిద్దారు. బంగారు తెలంగాణ లక్ష్యసాధన దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. 20 వసంతాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పార్టీ వార్షికోత్సవ వేడుకలు నేడు నిరాడంబరంగా జరగనున్నాయి.

author img

By

Published : Apr 27, 2021, 4:56 AM IST

20ఏళ్లు పూర్తిచేసుకున్న తెరాస
20ఏళ్లు పూర్తిచేసుకున్న తెరాస

తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చిన రాజకీయ పార్టీ. అంతకు ముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు తెరాస అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్​.. గులాబీ జెండాను ఎగురవేశారు.

ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది తెరాస. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్​తో పొత్తుపెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత తెరాస రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్​తో పాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది.

మొదటి ముఖ్యమంత్రిగా..

2009 నవంబర్ 29న కేసీఆర్​ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్​ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్​ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవ తెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు.

రెండోసారీ ఘన విజయం..

2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా తెరాస ఘన విజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీ.. 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. ఫలితంగా కేసీఆర్​ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్​ తనయుడు కేటీఆర్​ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది.

నిరాడంబరంగా వేడుకలు..

స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్​ నేతృత్వంలోని తెరాస సర్కార్.. పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడక గదుల ఇళ్లు, కుల వృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. కాళేశ్వరం పేరిట ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుల దశల ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాష్ట్రంలో పంటలు రికార్డు విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీ నేడు ద్విదశాబ్ద వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా వేడుకలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రోజుకు పది లక్షల టీకాలు వేసేలా ప్రభుత్వ కసరత్తు

తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చిన రాజకీయ పార్టీ. అంతకు ముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు తెరాస అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్​.. గులాబీ జెండాను ఎగురవేశారు.

ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది తెరాస. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్​తో పొత్తుపెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత తెరాస రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్​తో పాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది.

మొదటి ముఖ్యమంత్రిగా..

2009 నవంబర్ 29న కేసీఆర్​ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్​ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్​ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవ తెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు.

రెండోసారీ ఘన విజయం..

2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా తెరాస ఘన విజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీ.. 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. ఫలితంగా కేసీఆర్​ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్​ తనయుడు కేటీఆర్​ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది.

నిరాడంబరంగా వేడుకలు..

స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్​ నేతృత్వంలోని తెరాస సర్కార్.. పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడక గదుల ఇళ్లు, కుల వృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. కాళేశ్వరం పేరిట ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుల దశల ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాష్ట్రంలో పంటలు రికార్డు విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీ నేడు ద్విదశాబ్ద వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా వేడుకలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రోజుకు పది లక్షల టీకాలు వేసేలా ప్రభుత్వ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.