గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలనే సీఎం కేసీఆర్ పిలుపునకు తెలంగాణ విద్యుత్ సంస్థల అధిపతులు స్పందించారు. పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమానికి ఆకర్షితులై, తమ గ్రామాల అభివృద్ధికి ఇతోధికంగా సాయం అందించేందుకు సిద్ధమయ్యారు.
ప్రతీ ఇంటికి చెత్తబుట్టలు...
జెన్కో–ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తన స్వగ్రామమైన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడెంలో తన సొంత ఖర్చులతో ప్రతీ ఇంటికి రెండు చొప్పున ప్లాస్టిక్ బుట్టలు అందించారు. దాంతో పాటు ఇండ్ల నుంచి చెత్త సేకరించడానికి ఆటో ట్రాలీని గ్రామ పంచాయతీకి బహుకరించాలని నిర్ణయించారు. గతంలో ఇదే గ్రామంలో కాటమయ్య దేవాలయం నిర్మాణానికి సీఎండీ ప్రభాకర్ రావు రూ.4 లక్షల విరాళం అందించారు.
ఊరికి వైకుంఠధామం...
ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లిలో వైకుంఠధామం నిర్మాణానికి అర ఎకరం భూమిని ఇచ్చారు. ఇదే గ్రామంలో గతంలో రఘుమారెడ్డి కుటుంబానికి చెందిన ఎకరం భూమిని సబ్స్టేషన్ నిర్మాణానికి ఉచితంగా ఇచ్చారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు తన సొంత గ్రామమైన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలో పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమాల కోసం రూ.లక్ష విరాళంగా అందించారు.