దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై కేంద్ర ఆయుర్వేద వైజ్ఞానిక పరిశోధన మండలి (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్- సీసీఆర్ఏఎస్) చేపట్టిన అధ్యయనానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. మందును స్వీకరించిన వ్యక్తుల అభిప్రాయాలు, వైద్య నివేదికలు సేకరించాలనుకున్న సీసీఆర్ఏఎస్ ఆ బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థతో పాటు తిరుపతి ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాలకు అప్పగించింది. తొలిదశలో 500 మంది నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ద్వారా ఔషధం పనితీరుపై ఓ అంచనాకు రావాలని భావించారు.
ఈ రెండు సంస్థల సిబ్బంది తమకు అందిన సెల్ఫోన్ నంబర్ల ఆధారంగా రోగులు, వారి బంధువులకు సోమవారం నుంచి ఫోన్ చేయడం ప్రారంభించారు. ‘జాబితాలోని 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. 42 మంది తాము అసలు మందు తీసుకోలేదని చెప్పారు. మరో 36 మంది ఒకే నంబరు ఇచ్చారు. ఔషధం తీసుకున్నట్లు చెబుతున్న వారిలోనూ అనేక మంది వైరస్ రాకుండా ముందుజాగ్రత్తగా వేసుకున్నామని తెలిపారు. మరికొందరు కొవిడ్ బారిన పడ్డ తర్వాతే మందు తీసుకున్నామని చెప్పినా.. సంతృప్తికరంగా వివరాలు వెల్లడించలేద’ని అధికారులు పేర్కొంటున్నారు.
ఆయుర్వేద సంస్థల అధికారులకు ఇప్పుడు ఏం చేయాలన్న మీమాంస తలెత్తింది. పోలీసులు ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేయగా.. ఆశించిన వివరాలు రాలేదు. దీంతో ప్రభుత్వానికి ఎలా నివేదించాలంటూ తర్జనభర్జన పడుతున్నారు. మరింతమంది ఫోన్ నంబర్లు పంపించాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులను కోరారు. ఆనందయ్య దగ్గర సుమారు 70 వేల మంది ఔషధం తీసుకున్నట్లు పోలీసులు, నిఘా వర్గాల అంచనా. తన వద్దకు వచ్చిన వారి నుంచి ఆయన ఎలాంటి వివరాలు సేకరించలేదు. పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు ఈ నంబర్లను సేకరించారు. వీరితో మాట్లాడినా పెద్దగా వివరాలు రాబట్టలేనందున.. మరింత మందిని ఆరా తీస్తేగానీ ఓ స్పష్టత రాదని వైద్య అధికారులు చెబుతున్నారు.
క్లినికల్ ట్రయల్స్గా గుర్తించాలి
ఆనందయ్య మందుల పంపిణీ, వైరస్ బాధితులకు ఆరోగ్యం బాగుండడాన్ని క్లినికల్ ట్రయల్స్గా గుర్తించాలని నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి, ఆయుర్వేద వైద్యులు వేముల భానుప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ ప్రకారం ఆయుర్వేద క్వాలిఫైడ్ వైద్యులు ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండానే ఔషధం తయారుచేసి, రోగులకు ఇవ్వవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనందయ్య గత నెల నుంచి కరోనా బాధితులకు మందులు ఇస్తున్నా... అభ్యంతరాలు, ఫిర్యాదులు రాలేదని తెలిపారు. వీటిని క్లినికల్ ట్రయల్స్గా గుర్తించకపోవడం వెనుక దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిబంధనలు సాకుగా చూపి ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన మందుల వల్ల ఉపయోగం ఉందా? లేదా? అన్న విషయాన్ని తేల్చాలని కోరారు.
ఇదీ చదవండి:'కృష్ణపట్నంలో 144 సెక్షన్.. గ్రామంలోకి వస్తే కఠిన చర్యలు'