నాటక రంగంలో 135 ఏళ్ల చరిత్ర కలిగిన సురభి కళాకారులను ఆదుకునేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలిసారిగా ఆన్లైన్ వేదికగా ప్రేక్షకులు సురభి నాటకాలను వీక్షించేలా ఏర్పాట్లు చేసింది. శ్రీవెంకటేశ్వర సురభి థియేటర్ జయచంద్రవర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
పురాణ ఇతిహాస నాటకాలు
మార్చి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఆన్లైన్ స్ట్రీమింగ్లో సురభి నాటకాలను ప్రదర్శించనున్నారు. సురభి నాటకాల్లో ప్రఖ్యాతి గాంచిన మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం లాంటి 9 నాటకాలను ఆన్లైన్లో ప్రదర్శించనున్నారు. బుక్ మై షో ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ఈ నాటకాలను వీక్షించవచ్చు. తద్వారా సమకూరే మొత్తాన్ని సురభి కళాకారుల కుటుంబాలకు అందజేయనున్నట్లు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు కరోనా అడ్డుగోడగా మారకూడదనే ఉద్దేశంతో సినిమా, నాటకం, సాహిత్య కార్యక్రమాలను విరివిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని హరికృష్ణ వివరించారు. సురభి నాటకాలను ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి చేరువ చేసేందుకు ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: వంటకాలే ఆ వనితల ఉపాధి... విదేశాలకు వారి అభి'రుచి'