గ్రేటర్ హైదరాబాద్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీలు), అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు అన్నిచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్లో 97, మేడ్చల్ జిల్లాలో 79, రంగారెడ్డి జిల్లాలో 20 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. 30 నిమిషాల్లోనే ఫలితం చెప్పేస్తున్నారు. పాజిటివ్ వస్తే...కరోనా ఉన్నట్లే. లక్షణాలు ఉన్నవారికి ఒకవేళ నెగెటివ్ వస్తే మాత్రం అనుమానించాల్సిందేనని వైద్యులే అంటున్నారు. ఇలాంటి వారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ పరీక్ష ఫలితానికి 2 నుంచి 3 రోజులు పడుతోంది. అందువల్ల ఈ పరీక్షకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. లక్షణాలు తీవ్రమై ఆరోగ్య పరిస్థితి ముదిరాక ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటి వారి ఊపిరితిత్తులకు సీటీ స్కాన్ చేసి కరోనా ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? నిర్ధారిస్తారు. కరోనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆమేరకు చికిత్సలు అందిస్తారు. జ్వరం, గొంతునొప్పి, జలుబు, ఆయాసం, గుండె పట్టేసినట్లు ఉంటే...అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం మేలని వైద్యులు చెబుతున్నారు. 95 శాతం వరకు ఆర్టీ-పీసీఆర్లో తెలుస్తుంది. ఒకవేళ ఈ టెస్టులో నిర్ధారణ కాకపోతే...అప్పుడు ఛాతీ ఎక్స్రే, లేదంటే సీటీ స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా పీహెచ్సీల వద్ద ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయడం లేదు. కేవలం యాంటీజెన్లతో సరిపెడుతున్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. నెగెటివ్ వచ్చింది కదా అని కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు, మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించి ఆర్టీ పీసీఆర్ పరీక్షకు వెళుతున్నారు. అక్కడ నిర్ధరణ అయిన వారు అప్పటి వరకు బయట తిరగడం మరికొందరికి కరోనా సోకుతోంది.
పది చోట్ల ఉచితంగానే పరీక్షలు
గ్రేటర్లో దాదాపు పది ప్రభుత్వ ల్యాబ్ల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. నేరుగా వెళితే పరీక్షలు చేయరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వాబ్లు స్వీకరించి ఆ ల్యాబ్లకు పంపితే పరీక్షలు చేస్తున్నారు. ఐసోలేషన్ కేంద్రాలుగా ఉన్న చార్మినార్ యునానీ, అమీర్పేటలోని ఆయుర్వేద ఆసుపత్రి, నేచర్ క్యూర్లో అనుమానితుల నుంచి స్వాబ్లు తీసి ఆర్టీసీ-పీసీఆర్ ల్యాబ్లకు పంపిస్తున్నారు. ప్రభుత్వ సంచార వాహనాల్లోనూ, కొన్ని ప్రైవేటు ల్యాబ్లు ఈ పరీక్షలు చేస్తున్నాయి. ప్రైవేటు ల్యాబ్లకు ప్రతి టెస్టుకు రూ.2200, ఇతర ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేసే ప్రభుత్వ ల్యాబ్లు
- గాంధీ వైద్య కళాశాల, సికింద్రాబాద్
- ఉస్మానియా మెడికల్ కళాశాల, సుల్తాన్బజార్
- ఫీవర్ ఆసుపత్రి, నల్లకుంట
- నిమ్స్, పంజాగుట్ట(కేవలం వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే)
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, నారాయణగూడ
- ఈఎస్ఐ మెడికల్ కళాశాల, హైదరాబాద్
- సీసీఎంబీ, తార్నాక
- సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్, హైదరాబాద్
- రైల్వే ఆసుపత్రి, లాలాగూడ.
- కరోనా లక్షణాలుంటే ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి
- నిర్లక్ష్యం చేస్తే విషమ పరిస్థితికి చేరుకొనే ప్రమాదం
ఇదీ చూడండి : షేక్పేట్ తహసీల్దార్, ఆర్ఐను అనిశాకు పట్టించిన వ్యక్తి అరెస్టు