పల్లె ఎందుకు కన్నీరు పెడుతుంది? ఇదే ప్రశ్న శీతల్ మెహతాను తరచూ తొలిచేసేది. గుజరాత్ మూలాలున్న శీతల్.. కెనడా పౌరురాలిగా అందమైన జీవితాన్ని గడుపుతుండేది. చదువుకునే రోజుల్లో.. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత.. సంపదతో తులతూగుతున్నప్పుడు కూడా.. పల్లె భారతం గురించి పదే పదే ఆలోచించేది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని ఎక్కడో చదివిందామె. ఆ కొమ్మలను పేదరికం పురుగు తొలుస్తుంటే.. దేశం బాగుపడేది ఎప్పుడు? అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నకు బంగ్లాదేశ్ సామాజిక కార్యకర్త మహ్మద్ యూనస్ రూపంలో జవాబు దొరికింది. పల్లెవాసులకు సూక్ష్మరుణాలు అందిస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. ఆర్థిక స్వావలంబన అందించిన తీరు ఆమెను ఆకర్షించింది. తనూ అదే మార్గాన్ని ఎంచుకుంది. శాంతి లైఫ్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించి గుజరాత్లో సంక్షేమ శంఖం పూరించింది.
స్వయం సమృద్ధి నినాదం..
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసిన శీతల్కు ఆర్థికరంగంపై సంపూర్ణ అవగాహన ఉంది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు గుజరాతీ అసోసియేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలూ నిర్వహించడం తెలుసు. ఆమె ఉద్యోగం చేసిన సంస్థలు సామాజిక బాధ్యత నిర్వహణలో భాగంగా పలు అంతర్జాతీయ సేవా సంస్థలకు నిధులు అందిస్తుండేవి. వాటి గురించి తల్లిదండ్రుల దగ్గర ప్రస్తావించేది శీతల్. అదే సమయంలో గుజరాత్లోని పల్లెల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగిందామెకు. సూక్ష్మ రుణాలు అందించి పల్లెల ముఖచిత్రాన్ని మార్చాలని సంకల్పించింది. అలా 2009లో శాంతి లైఫ్ ఇండియా ఫౌండేషన్ను ప్రారంభించింది. అనుకుందే తడవుగా.. పది మందికి సాయం చేసి చేతులు దులుపుకోలేదు. సమస్య మూలాలను గుర్తించి దాన్ని పరిష్కరించాలనుకుంది. గుజరాత్లోని మారుమూల పల్లెల్లో పర్యటించింది. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నా.. ప్రజలు పరిమితంగా వాడుకుంటున్నారని గ్రహించింది. చాలీచాలని ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక.. ప్రైవేట్ రుణాలు తీసుకొని, వడ్డీలు చెల్లించలేక కుదేలవుతున్నారని అర్థమైంది. ‘స్వయం సమృద్ధి, స్వచ్ఛ గ్రామాలు’ నినాదంతో కాగల కార్యానికి పూనుకుంది.
అక్షరాస్యత.. ఆర్థిక స్వావలంబన..
చాలామంది రుణాలు తీసుకోవడం సాధారణమే! అయితే రుణాలపై వడ్డీ, రాయితీలపై కనీస అవగాహన ఉండదు. అందుకే ముందుగా స్థానిక సమాఖ్యలు, స్వయం సహాయక బృందాలతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. తర్వాత వివిధ వృత్తులకు చెందిన పెద్దలతో సమావేశమై.. వారిలో మార్పు తీసుకొచ్చింది. బ్యాంకు రుణాలు, వడ్డీ విధానాల గురించి ప్రచారం కల్పించింది. సూరత్, సురేంద్రనగర్, బోర్బి, బావ్నగర్, వడోదర ప్రాంతాల్లోని పల్లెల్లో పలు అవగాహనా సదస్సులు నిర్వహించి.. కుల వృత్తుల్లో ఉన్న పురుషులకు, చేతివృత్తులు చేసుకునే మహిళలకూ శాంతి లైఫ్ ద్వారా సూక్ష్మ రుణాలు అందించింది. గ్రామస్థుల నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహించి.. ఆర్థిక స్వావలంబన కలిగించింది. అవసరమైన వారికి శిక్షణ అందించే ఏర్పాట్లూ చేసింది. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక సదస్సులు నిర్వహించింది. తక్కువ వడ్డీకి రుణాలు అందించి.. సులభ వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది శాంతిలైఫ్ ఇండియా సంస్థ. దీంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, వయోజనులకు విద్యాబోధన ఇలా పలు సామాజిక కార్యక్రమాలూ నిర్వహిస్తోంది. గుజరాత్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ...ఇతర రాష్ట్రాల్లోనూ సేవలు విస్తరించి సూక్ష్మ రుణాలిస్తూ.. సంక్షేమ పథాన్ని కొనసాగిస్తోంది శీతల్.