ఇంటర్ బోర్డు, గోబ్లరీనా సంస్థలు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని బాధిత ఇంటర్ విద్యార్థులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రీవెరిఫికేషన్లో 1137 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారంటే... ఇంటర్ బోర్డు అధికారుల వైఫల్యానికి ఇదే నిదర్శనమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ మండిపడ్డారు. బోర్డు అధికారులు మెుదట్లో తమ తప్పే లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కనీసం సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని...అలాగే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఇరు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇంటర్ బోర్డు కార్యదర్శి తమ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు బాధిత విద్యార్థులు ఆరోపించారు. తాము చెల్లించే ఫీజుతో జీతాలు తీసుకునే అధికారులు తమను అవహేళన చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ తాను చెప్పిందే వేదం అనే విధంగా బెదిరిస్తున్నారని వారు వెల్లడించారు.