కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని సమస్యల సత్వర పరిష్కారానికి 'ఈ- ఆఫీస్' కు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి... ఇక నుంచి ఈ- ఆఫీస్ సేవలను వినియోగించుకునే దిశగా కమిషన్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ బషీర్బాగ్లోని కమిషన్ కార్యాలయంలో సిబ్బందికి ఎన్ఐసీ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ-ఆఫీస్ ద్వారా కమిషన్ మరింత పారదర్శకంగా, వేగంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని ఛైర్మన్ తెలిపారు. కార్యాలయానికి రానవసరం లేకుండా ఈ-మెయిల్ ద్వారా గానీ లేదా పోస్టు ద్వారా గానీ ఫిర్యాదులను పంపవచ్చని తెలిపారు. సమస్యలను ఈ- ఆఫీస్ ద్వారా సత్వరమే పరిష్కరించి ఎస్సీ, ఎస్టీలకు కమిషన్పై ఉన్న బరోసాను నిలబెట్టుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కమిషన్ సెక్రటరీ పాండ దాస్, డీడీ లావణ్య, రిటైర్డ్ జేడీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.