నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. తక్షణమే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఐకాస అధ్యర్యంలో హైదరాబాద్లోని విద్యా శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు. టీఎస్పీఎస్సీ విడుదల చేసిన టీఆర్టీ-2017 నోటిఫికేషన్ హిందీ భాషా పండిట్ తుది ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నోటిఫికేషన్లో అన్ని భాషల ఉపాధ్యాయుల ఫలితాలు విడుదల చేశారని.. అభ్యర్థులు ఉద్యోగాల్లో కూడా చేరారని వివరించారు. కానీ హిందీ లాంగ్వేజ్ పండిట్కు సంబంధించి 342 పోస్టులకు సంబంధించిన ఫలితాలను నాలుగేళ్లు గడుస్తున్నా... నేటికి ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలయాపన చేయకుండా ఫలితాలను వెల్లడించి... అర్హులైన అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఇక సిద్దిపేటలో అన్ని రకాల వైద్య పరీక్షలు : హరీశ్రావు