పబ్లిక్ సర్వీస్ కమిషన్ రబ్బర్ స్టాంప్గా తయారైందని... నోటిఫికేషన్లు వేయడం, నియామకాలు ఆపడం అలవాటైపోయిందని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ధర్నాలో ఆర్. కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు, నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీలం వెంకటేశ్, గురుకుల ప్రిన్సిపల్ అభ్యర్థులు పాల్గొన్నారు.
గురుకుల ప్రిన్సిపల్ పోస్టులు వేసి మూడేళ్లవుతున్నా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదని కృష్ణయ్య అన్నారు. కోర్టు కేసుల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని... ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా... భర్తీ చేయలేదని మండిపడ్డారు. వారం రోజుల్లో గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు ఎంపికైన వారికి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చి... ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.