రాష్ట్రంలో ఈ ఏడాది 34వేల 901 పాలిటెక్నిక్ సీట్లు భర్తీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 11వేల 546 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక ఎయిడెడ్ కాలేజీకి 300 సీట్లతో అనుమతి లభించింది. 90 ప్రైవేట్ కళాశాలల్లో... 23వేల 55 సీట్లకు సాంకేతిక విద్యా మండలి ఆమోద ముద్ర వేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 35 సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
ఈ ఏడాది తొలిసారి తమకు నచ్చిన కేంద్రంలో వీలైన సమయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేలా స్లాట్ బుక్కింగ్ విధానం అమలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, స్లాట్ బుక్కింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. మొదటి రోజున 12వేల 511 మంది రుసుము చెల్లించి... 12వేల 303 స్లాట్ బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 21వరకు ధ్రువపత్రాల పరిశీలన, 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఈనెల 27న అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.