రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. నిర్దేశించిన గడువుకు... కొనసాగుతున్న ప్రక్రియకు ఎక్కడా పొంతన లేదు. మహమ్మారి నుంచి రక్షణకు టీకా మినహా మరో అస్త్రమేదీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా దిగ్గజ నిపుణులంతా చెబుతున్నా చాలామంది ముందుకు రావట్లేదు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి సుమారు కోటి మంది అర్హులుంటారని వైద్యఆరోగ్యశాఖ అంచనా. టీకాల ప్రక్రియ ప్రస్తుత మాదిరే కొనసాగితే.. వారందరికీ తొలిడోసు వేయడానికి నవంబరు దాటుతుంది. కానీ జులై 31 నాటికే పూర్తిచేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గణాంకాలను గమనిస్తే ఒక రోజులో సగటున 35 వేల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అంతకు రెండింతల మందికిపైగా ఇచ్చినప్పుడే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పెరిగిపోతున్న లక్ష్యం
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. తొలుత వైద్యసిబ్బందికి, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్ సిబ్బందికే వేశారు.
- ఈ విభాగాల వారు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో మొత్తం 2,53,481 మంది మాత్రమే టీకాల కోసం కొవిన్ యాప్లో తమ సమాచారాన్ని నమోదు చేసుకున్నారు.
- వీరిలోనూ 2,23,142 మందే తొలి డోసును, 1,69,642 మంది రెండో డోసును పొందారు.
- పోలీసు, రెవెన్యూ కేటగిరీలో 2,87,099 మంది నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకూ 1,13,791 మంది తొలి డోసును, 64,861 మంది రెండో డోసును తీసుకున్నారు.
- మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడినవారు, 45-59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలివ్వడానికి అనుమతి లభించగా.. అప్పటి నుంచి కొంత వేగం పెరిగింది. 60 ఏళ్లు పైబడిన కేటగిరీలో సుమారు 54 లక్షల మంది ఉంటారని అంచనా.
- ఇప్పటికి 3,89,383 మంది తొలి డోసు పొందారు.
- 45-59 ఏళ్లలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సుమారు 10 లక్షల మంది ఉంటారని అంచనా వేయగా.. వీరిలోనూ తాజా గణాంకాల ప్రకారం 2,02,380 మంది మొదటి డోసు తీసుకున్నారు.
- ఇప్పటి వరకూ అన్ని కేటగిరీలను కలిపి చూస్తే 9,28,696 మంది మాత్రమే తొలి డోసును, 2,34,503 మంది రెండో డోసును పొందారు. దీనిప్రకారం రోజుకు సగటున 35 వేల మంది తొలి డోసును తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
- ఏప్రిల్ 1 నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలను ఇవ్వాలని నిర్ణయించడంతో.. తాజాగా ఈ కేటగిరీలో మరో 30 లక్షల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా వేస్తోంది.
వ్యాప్తిని అడ్డుకోవాలంటే...
రాష్ట్రంలో ఒకవైపు కొవిడ్ రెండోదశ ఉద్ధృతి.. మరోపక్క టీకాల పంపిణీకి మరో ఎనిమిది నెలలు పడితే.. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుందనే ఆందోళన నెలకొంది. అతివేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్ కోరల్లో ప్రజలు లక్షల సంఖ్యలో చిక్కుకొనే అవకాశాలున్నాయి. దీన్ని నివారించాలంటే వ్యాక్సిన్ పంపిణీలో మార్పులు అవసరం. సాధ్యమైనంత వేగంగా ఎక్కువ మందికి టీకాలను వేయడం అతి ముఖ్యమైన ప్రణాళికగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా టీకాలు పొందాల్సి ఉన్న 90,71,304 మందికి జులై 31 నాటికి తొలి డోసును పూర్తి చేయాలంటే.. రోజుకు 72,570 మందికి కచ్చితంగా వేయాలి. రెండో డోసును ఆగస్టులోగా ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 50 శాతం మందిలో కొవిడ్ సోకి తగ్గిపోయి ఉంటుందని ఐసీఎంఆర్ సర్వే చెబుతుండగా.. మరో కోటి మందికి(రాష్ట్ర జనాభాలో సుమారు 25%) టీకాలను ఇవ్వడం ద్వారా వైరస్ వ్యాప్తి నియంత్రణ సులువవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఏప్రిల్ నుంచి 2000 కేంద్రాలు
రాష్ట్రంలో టీకాల పంపిణీకి వచ్చే నెల 1 నుంచి 2 వేల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. 45 ఏళ్ల పైబడినవారందరూ వేయించుకోవాలి. రోజుకు లక్ష మందికి ఇవ్వడానికి కూడా వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు అపోహలు వీడి టీకాలను పొందడానికి ముందుకు రావాలి.
- డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రజారోగ్య సంచాలకుడు
ఇదీ చదవండి: హోలీ వేడుకలు.. మానేస్తే బెస్ట్.. జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి!