హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్లోని ఆలివ్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న తమను యాజమాన్యం వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను నిర్భందించి కొవిడ్ డ్యూటీలు చేయిస్తున్నారని బాధిత నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 101, 102 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ... విధులకు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ యాజమాన్యం ఒత్తిడి చేయడం పట్ల తాము మనోవేదనకు గురవుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. విధులకు హాజరు కాకుంటే యాజమాన్యం సమకూర్చిన వసతి గృహాన్ని వెంటనే ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేశారు.
మీరే ఆదుకోవాలి...
తమను ఆదుకోవాలని తెలంగాణ నర్సింగ్ సమితికి బాధితులు లేఖ రాశారు. ఇప్పటికే ఎంతో మంది నర్సులకు కరోనా వైరస్ సోకిందని.. వ్యాధి లక్షణాలున్నప్పటికీ విధులకు రావాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం మీద తమకు నమ్మకముందని... తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.