Nomination Festival in Telangana Elections : శాసన సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు కొండగట్టు అంజన్నను (Kondagattu Temple)దర్శించుకున్న ఆయన.. అక్కడి నుంచి భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా దాసరి ఉష నామినేషన్ వేశారు. హనుమకొండ జిల్లా పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ నామినేషన్ వేశారు.
Etela Rajender Nomination in Gajwel : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కమల పార్టీ అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్ పత్రాలను రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అందజేశారు. జనగామ ఆర్డీవో కార్యాలయంలో బీఆర్ఎస్(BRS Party) అభ్యర్థి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ముఖ్యమంత్రి కేసీఆర్కు పోటీగా నామినేషన్ వేసినట్లు ఈటల పేర్కొన్నారు.
తెలంగాణలో జోరుగా నామినేషన్లు, ఇవాళ ముఖ్య నాయకుల్లో రేవంత్, బండి సంజయ్
"కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పంచాయితీ జరుగుతుంది. పేదల కలలు కొల్లగొట్టిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోబోతుంది. హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్లో ఎక్కువ మెజార్టీ రాబోతుంది. ప్రతి నాయకుడు ఉద్యమంలా పని చేసి పార్టీని నిలబెట్టండి." - ఈటల రాజేందర్, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే స్వగ్రామం కోనాపూర్ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా రామ్చందర్ రాజనర్సింహా నామినేషన్ వేశారు.
Today Nominations in Telangana : రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బహుజన ముక్తి పార్టీ తరఫున చంద్రకాంత్.. చిల్లర నాణేలతో(Retail Coins) నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భారీ బలగంతో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు.
"తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ది పొందింది. 2018లో దత్తత పేరుతో ఉమ్మడి నల్గొండ ప్రజలను మోసగించింది చాలు ఇంకోసారి మోసపోవద్దు. 30న పోలింగ్ ఉంది.. అందుకే 27 నుంచి మీ అకౌంట్లోకి రుణమాఫీ, రైతు బంధు డబ్బులు వచ్చి పడతాయి. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న1200 మందికి న్యాయం జరగలేదు. కేసీఆర్ డిసెంబర్ 3న తన సీఎం పోస్ట్కు రాజీనామా చేస్తారు. డిసెంబరు 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం." -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి