గడిచిన పాతికేళ్లలో ఏ దసరా పండుగ కూడా జీతాలు లేకుండా గడపలేదు... ఈసారి మాత్రం జీతం లేకుండా దసరా పండుగ వెళ్లిపోయిందని ఆర్టీసీ కార్మికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వచ్చేవని... గడిచిన నాలుగైదు నెలలుగా కనీసం నాలుగు, ఐదు తేదీల్లో వచ్చేవని... ఇప్పుడు 8వ తేదీ దాటినా జీతాలు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో 49వేల 860 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ఇందులో డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్ వైజర్లు, మెకానిక్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్ల నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ఉన్నారు.
ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు
తెలంగాణలో ముఖ్యమైన పండుగ దసరా. అందులో సద్దుల బతుకమ్మను ఆడపడుచులు చాలా గొప్పగా జరుపుకుంటారు. అటువంటి పండుగకు కనీసం పూలు కొనలేని పరిస్థితి ఎదురైందని వాపోయారు. పూల ధరలు పెరగగా... మరోవైపు జీతం లేకపోగా... బతుకమ్మను కూడా పేర్చలేకపోయామన్నారు. ఆనవాయితీ తప్పవద్దని రెండు మూడు పూలతో మాత్రమే తయారుచేసి బతుకమ్మ ఆట ఆడామని ఆర్టీసీ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. దసరా పండుగ అంటేనే మాంసం తినడం సర్వసాధారణమని... ఈసారి నోటిలో ముక్కలేకుండానే పండుగ వెళ్లిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. పప్పన్నంతోనే సరిపెట్టుకున్నామన్నారు. ప్రతి దసరాకు కొత్తచీర కొనుక్కుంటామని... ఈ దసరా పండుగకు మాత్రం కొత్త చీర కూడా కొనుక్కులేదని మహిళలు పేర్కొన్నారు.
జీతాలు రాకున్నా... సమ్మెను ఆపేదిలేదు...
జీతాలు రాకున్నా సరే ఆర్టీసీ సమ్మెను ఆపేదేలేదని కార్మిక జేఏసీ స్పష్టం చేస్తుంది. ఈరోజు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో టీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుందని ఈ సమావేశానికి అన్ని రాజకీయపక్షాలను ఆహ్వానించామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
ఆర్టీసీ సమ్మె నేటితో ఐదో రోజుకు చేరుతుంది. మరోపక్క ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికీ జీతాలు రాలేదు. ఈసారి జీతాలు తీసుకోకుండానే దసరా పండుగ వెళ్లిపోయిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర: భట్టి